‘‘సమాలోచనము మహత్తరమగు అవగాహనము ననుగ్రహించును, ఊహను దృఢవిశ్వాసముగా పరివర్తిత మొనరించును. నిశీధప్రపంచమున పథమును జూపి, నిర్దేశించు శోభాయమాన దీపిక యిది. ఏలయన, అందున్నదియును, ఉండనున్నదియును పరిపూర్ణత, పరిపక్వతల స్థానమే. అవగాహనానుగ్రహ పరిపక్వత, సమాలోచన మూలకముగ వెల్లడియైనది.’’


బహాఉల్లా

బహాఉల్లా ప్రతిపాదించిన దివ్యధర్మంలో పురోహితవ్యవస్థ లేదు. దీని వ్యవహారాలను – రహస్య ఓటింగ్ విధానంలో ఎన్నుకోబడిన స్థానిక, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయస్థాయి వ్యవస్థలు నిర్వహిస్తాయి. ఎన్నిక ప్రక్రియసైతం - ప్రచారమూ, సంరంభమూలాంటివి లేకుండానే జరుగుతుంది. ఈ వ్యవస్థకు ఎన్నుకోబడే విశ్వాసులకు వ్యక్తిగతంగా ఎలాంటి అధికారమూ ఉండదు; అయితే, వారు సభ్యులుగా ఉండే వ్యవస్థలకు చట్టపరమైన, నిర్వహణాపరమైన, న్యాయపరమైన పాలనాధికారాలు ఉంటాయి. బహాయి సమాజానికీ, సామాజికజీవిత అంతర్గత వ్యవహారాలకూ, ఆధ్యాత్మిక, భౌతికవనరుల వినియోగానికీ ఆయా వ్యవస్థలు బాధ్యత వహిస్తాయి.

బహాయి పాలనావిధానంలో అంతర్భాగమైన ఈ వ్యవస్థలు సమాలోచనా నియమ ప్రాతిపదికన పనిచేస్తాయి. ఈ నియమాన్ని అనుసరించి, వ్యవస్థల సభ్యులు, ప్రతి అంశంలోనూ సత్యాన్ని అన్వేషించేందుకు సమాలోచనలను వినియోగిస్తారు. వారు తమ అభిప్రాయాలను నిష్కర్షగానే పంచుకుంటారు, అయితే, తమ వ్యక్తిగతాభిప్రాయాలే చెల్లుబాటు కావాలని పట్టుబట్టరు. తద్భిన్నంగా, వాస్తవంపట్ల మరింత విస్తృతావగాహన కోసమని, వారు - సమస్యను అవతలివారి దృక్కోణంనుండి కూడా పరిశీలించి తెలుసుకుంటారు. తెలివిగా పరిస్థితులను వాడుకోవడం, పక్షపాతవైఖరి నవలంబించడం, వ్యక్తిగతప్రాధాన్యతలనో, ప్రయోజనాలనో ఇతరులపై రుద్దజూడడంవంటి పద్ధతులను పూర్తిగా త్యజించడం జరిగింది.