“మానవుని యౌన్నత్యమున్నది సేవయందునను, సద్గుణముల యందుననే దక్క సిరిసంపదల యాడంబరమున కాదు. . . ”



బహాఉల్లా

బహాయి సమాజం ప్రపంచవ్యాప్తంగా ఆరంభించిన సమాజనిర్మాణ యత్నాలకు– చైతన్యతరమూ, అభ్యుదయప్రపూరితమూ అయిన సమాజనిర్మాణానికి అవసరమైన వివిధ కార్యకలాపాలనూ ఆరంభించేందుకై యువజనుల, వయోజనుల శక్తిసామర్ధ్యాలను పెంపొందించే వికేంద్రీకృత విద్యాప్రక్రియ ఒకటి - మూలబిందువుగా ఉంది. ‘అధ్యయన కేంద్రాలు’ గా వ్యవహరించబడే చిన్నచిన్న సాధారణ బృందాలకు ఈ విద్యాప్రక్రియను అందించడం జరుగుతున్నది. భగవద్వచనాల ప్రాతిపదికన రూపొందించబడిన ఈ అధ్యయనకేంద్రాల పాఠ్యక్రమం అన్ని నేపధ్యాలవారి మేధో, నైతిక, ఆధ్యాత్మిక, ఆచరణాత్మక సామర్ధ్యాలను ప్రోత్సహించేందుకై ఉద్దేశించబడి ఉంది. బాలల ఆధ్యాత్మిక విద్యా తరగతులనూ, ఆధ్యాత్మిక/భక్తి సమావేశాలనూ, అధ్యయనకేంద్రాలనూ నిర్వహించడం వంటి సమాజసేవాకార్యక్రమాలను ఏర్పాటు చేయగల సామర్ధ్యాలను పెంపొందించే పలు శిక్షణాక్రమాలు అధ్యయనకేంద్రాలలో అంతర్భాగంగా ఉన్నాయి.

‘శిక్షణాసంస్థానం’ గా వ్యవహరించబడే ఈ ప్రక్రియలో భాగంగా అందించబడుతున్న శిక్షణాక్రమాల అధ్యయనాన్ని కొనసాగించేవారు - వ్యవస్థీకృతం అయినప్పటికీ, సులభసాధ్యమే అయిన - సేవాపథంలో పయనిస్తారు. భగవద్వచనం మీదా, తమ జీవితాలకూ, సమాజాలకూ అది అందించే అంతఃసూచనలమీదా కూలంకషంగా చర్చించుకునేందుకూ, తమ సమాజ శ్రేయస్సుకు తమ పరిజ్ఞానాన్ని వినియోగించడానికి సమిష్టిగా కృషి చేసేందుకూ ఈ ప్రక్రియ అవకాశాన్నిస్తుంది.